PEN POWER
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 3:12 pm Posted By : SRIKANTH NARASIMHALA

కొండవీడు కోటలో విషాదం: ప్రేమజంట ఆత్మహత్య

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 10 :

యడ్లపాడు : మండలంలోని కొండవీడు కోట పరిధిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. విడిపోయి ఉండలేమన్న బాధతో ఓ ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు స్వర్ణభారత్ నగర్‌కు చెందిన రసిక మనికంఠ రాజు (20), అంకమ్మ నగర్‌కు చెందిన ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో, ఇటీవల యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.పెళ్లి తర్వాత భర్తతో ఉండలేక మనస్తాపానికి గురైన యువతి, తిరిగి గుంటూరుకు వచ్చేసింది. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన మనికంఠ రాజుతో కలిసి కొండవీడు కోటకు వెళ్లిన ఆమె, అక్కడ ఇద్దరూ కలిసి ‘స్పైకర్’ అనే పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మృతి

ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ మనికంఠ రాజు 8వ తేదీ సాయంత్రం కన్నుమూయగా, యువతి పరిస్థితి విషమించి 9వ తేదీన ప్రాణాలు విడిచింది. పర్యాటక ప్రాంతమైన కొండవీడు కోటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల తల్లులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజు మృతదేహానికి గురువారం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించగా, యువతి మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.