అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలు
– విశాఖలో ఘనంగా “ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు”
కార్యక్రమం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 31, 2026: విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో “ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు” అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు.గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరిగిన వివిధ కార్యక్రమాల పతాక స్థాయిగా ఈ మెగా ఫ్లాష్మాబ్, మెగా బీచ్ వాక్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలకు సౌకర్యార్థం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ, ” అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతికి, ఉపాధి అవకాశాలకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఇక్కడ స్థాపించబడతాయి,” అని పేర్కొన్నారు.ముఖ్యంగా విశాఖను సెమీ కండక్టర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సెమీ కండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన జరగనుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో డేటా సెంటర్ ఎకోసిస్టం బలంగా ఉందని, సెమీ కండక్టర్ పరిశ్రమతో విశాఖ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక నగరంగా అవతరిస్తుందని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు.

