మిర్చి ధర ఎందుకు పడిపోయింది

Why did the price of chillies fall?


గుంటూరు, పెన్ పవర్  ఫిబ్రవరి 20: 
ధరల చదరంగంలో మిర్చి రైతులు నిలువునా దగా పడ్డారు. కాచుకొని కూర్చున్న వ్యాపారులు.. అదును చూసి దెబ్బకొట్టారు. నిరుడు ఇదే సీజన్‌లో క్వింటాకు రూ.22 వేల చొప్పున వెచ్చించిన ఖరీదుదారులు.. ఈ ఏడాది సీజన్‌ నాటికి ధరలను అమాంతం తగ్గించారు. ఖరీదుదారుల వ్యూహానికి ధరలు నేలచూపులు చూస్తుండడంతో ఎర్ర బంగారం రైతులు బోరుమంటున్నారు. నిరుడు క్వింటా మిర్చిని రూ.22 వేల నుంచి రూ.23 వేల మధ్య కొనుగోలు చేయడంతో అన్నదాతలు ఈ పంట సాగుకు ఆశలు పెంచుకున్నారు. ఈ ధర మరికొంత పెరుగుతుందేమోనని కొందరు రైతులు కోల్డ్‌ స్టోరేజీల్లో భద్రపర్చుకున్నారు. ఇప్పుడు ధరలు దారుణంగా తగ్గడంతో నెత్తీనోరూ బాదుకుంటున్నారుగత సీజన్ వరకు మిర్చి ధర 21వేలకు పైగా పలికింది. అయితే.. సడెన్‌గా 13 వేలకు పడిపోవడం రైతులకు షాకిచ్చింది. అంతేకాదు క్వాలిటీ లేదంటూ కొన్ని చోట్ల తొలి కోత కాయ కూడా 10 వేలు నుంచి 12 వేలకే అడుగుతున్నారు. దాంతో మహమ్మారి తెగుళ్ల నుంచి పంటను కాపాడుకున్న మిర్చి రైతులు లబోదిబోమంటన్నారు. ధర పతనంతో ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్‌.. గుంటూరు మిర్చి యార్డ్‌ను సందర్శించడం కాకరేపింది. మిర్చి రైతులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరాకు సుమారుగా రూ.లక్ష పైగా పెట్టుబడి పెట్టారు. స్థానికంగా కూలీల కొరత ఏర్పడటంతో ఇతర రాష్ర్టాల నుంచి వాహనాల్లో కూలీలను తెప్పించుకొని మరీ మర్చి పంటలు కోశారు. మిర్చి తోటల వద్ద కూలీలకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఇలా మిర్చి కోతలకే ఎకరానికి సుమారు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. కానీ.. ఇంతలా శ్రమించి మిర్చిని కోసి మార్కెట్‌కు తీసుకెళ్తే ధరలు మాత్రం దారుణంగా పతనమై కన్పిస్తున్నాయి. నాణ్యతను బట్టి బహిరంగ మార్కెట్లో క్వింటా మిర్చి ధర రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు మాత్రమే పలుకుతోంది. దీంతో మిర్చి రైతుకు కంటతడి తప్ప మరేమీ లేకుండా పోతోంది. మరుసటి ఏడాది వరకూ కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచుదామంటే ఇప్పుడు పెట్టుబడులు పూడే మార్గం కన్పించడం లేదు. పైగా నిరుటి అనుభవం దృష్ట్యా అప్పటి ధర ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. దీంతో కొందరు రైతులు ఇదే ధరలకు తెగనమ్ముకుంటుండగా.. మరికొందరు రైతులు మాత్రం తమ పంటను కల్లాల్లోనే నిల్వ ఉంచుకొని ధరల పెరుగుదల కోసం ఎదురుచూస్తున్నారు.ఈ సందర్భంగా.. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్‌. 13వేల ధరతో మిరప రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే పంటలకు మద్దతు ధరలు కల్పించాలని.. లేనిపక్షంలో రైతుల తరపున పోరాటాలకు దిగుతామని జగన్‌ హెచ్చరించారుఇక.. రైతుల ఆందోళనలతో మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. ధరల స్థిరీకరణ నిధి కింద రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా ఏపీలో మిర్చి పంటలు దెబ్బతిన్నాయని.. మిర్చి రైతుల సమస్యను ప్రత్యేక కేసుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే.. ఢిల్లీ పర్యటనలో మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.మరోవైపు.. మిర్చి రైతుల విషయంలో జగన్‌ కామెంట్స్‌పై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రియాక్ట్‌ అయ్యారు. జగన్‌ తీరు కరెక్ట్‌ కాదని.. మిర్చికి మద్దతు ధర పెడితే అంతకుమించి రేటు పలకదని గుర్తుంచుకోవాలన్నారు. మిర్చి రైతుకు ఎక్కువ మేలు చేయాలనేదే తమ ప్రయత్నమని.. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.

About The Author: Admin