PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 10:12 pm Posted By : A YESOBU

అంగరంగ వైభవంగా సీత రాముల కళ్యాణం…

పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 27

మండల కేంద్రమైన పుల్లల చెరువు సమీపంలోని చౌటపల్లి గ్రామంలో వెలసిన ప్రసన్న ఆంజనేయ స్వామి భక్తుల కోరికలను తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్నాడు.దూరదూరాల నుంచి తరలి వచ్చే భక్తులతో ఆలయం నిత్యం కిటకిటలాడుతోంది.పూర్వం పుల్లల చెరువు సమీపంలో చౌటపల్లి గ్రామం ఉండేది.తమిళనాడు రాష్ట్రంలోని పేరంబుదూర్ ప్రాంతానికి చెందిన రామానుజ అయ్యంగార్ అనే బ్రాహ్మణుడికి ఈ ప్రాంతంలోని విస్తారమైన శోత్రియ భూములు చెందినవని స్థానిక పెద్దలు చెబుతుంటారు. చౌటపల్లితో పాటు చాపలమడుగు, ఎర్రగొండపాలెం మండలంలోని నరసాయపాలెం గ్రామాల్లోనూ ఆయనకు భూములు ఉన్నాయని, సుమారు వెయ్యి ఎకరాలకు పైగా ఆస్తి ఉండేదని చెప్పుకుంటారు.కాలక్రమేణా అయ్యంగార్ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టగా, ఆయన సోదరి, బంధువులు ఈ గ్రామాల్లోని భూములను విక్రయించి వెళ్లిపోయినట్లు సమాచారం.అయితే, చౌటపల్లిలోని ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయ్యంగార్ కాలంలోనే ప్రతిష్టించినట్లు విశ్వసిస్తున్నారు.అప్పటి నుంచి స్వామివారు భక్తుల కోరికలు తీర్చే దైవంగా పేరు గాంచారు.ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి తిరునాళ్లు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా పండుగ సందర్భంగా తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి దర్శనాలు చేసుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలనీలాలు సమర్పించి, పొంగళ్లను నైవేద్యంగా పెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ పూజారులు కాసులనాటి ఉమామహేశ్వరశర్మ, శేషఫణి శర్మలు స్వామివారికి అష్టోత్తర శతనామావళి, ఆకుపూజలు, అభిషేకాలు, ఇతర విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.అదే విధంగా పుల్లల చెరువులోని కోదండరామ స్వామి ఆలయం, కమ్మవారిపల్లెలోని పట్టాభిరామస్వామి ఆలయాల్లో కూడా శ్రీ సీతారామచంద్ర స్వాములను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించి తరిచారు.ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రసాదాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.భక్తులకు విస్తృతంగా సేవలు అందించారు. శ్రీరామనవమి ఉత్సవాలతో మొత్తం ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.