PEN POWER
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 8:35 pm Posted By : Sathish Bede

అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం

 

చింతూరు పెన్ పవర్ మార్చి 25:

 అటవీశాఖ ఆధ్వర్యంలో స్థానికంగా భారీ అవగా హన కార్యక్రమం నిర్వహించబడింది. అడవుల్లో నివసించే ప్రజల్లో ప్రకృతి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చింతూరు మండల పరిధిలో వివిధ గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటించి ప్రజలకు అటవీ సంరక్షణ, వన్యప్రాణి రక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ వంటి అంశాలపై వివరించారు. ముఖ్యంగా వేసవి కాలంలో అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సుమారు 40 మంది సిబ్బంది పాల్గొని ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అదేవిధంగా 500 మందికి పైగా గ్రామస్థులు, వన సమాఖ్య (వి ఎస్ ఎస్ ) సభ్యులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని అటవీ సంరక్షణకు తమ వంతు సహకారం అందించాలని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమానికి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డి ఎఫ్ ఓ ) డి. రవీంద్రనాథ్ రెడ్డి, ఐ ఎఫ్ ఎస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందుతుందని అన్నారు. అలాగే గ్రామస్థులు, యువత, మహిళా సంఘాలు కలిసి అటవీ సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరిగిందని అధికారులు తెలిపారు.