PEN POWER
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 5:50 am Posted By : Ratnam D

అడ్డతీగల మండలం డి.కృష్ణవరం గ్రామంలో పెద్దపులి సంచారం – పశువులపై దాడి, గ్రామంలో భయాందోళనలు.

 

అడ్డతీగల, పెన్ పవర్, మార్చి 07: అడ్డతీగల మండలంలోని డి.కృష్ణవరం గ్రామంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న ఈ గ్రామంలో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేయడంతో ఒక ఆవు, దాని దూడ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు.
స్థానిక సమాచారం ప్రకారం, గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులను మేతకు తీసుకెళ్లిన సమయంలో పులి అకస్మాత్తుగా దాడి చేసినట్లు తెలుస్తోంది. పశువుల కాపరులు ఉదయం పశువులను చూసేందుకు వెళ్లినప్పుడు ఒక ఆవు, దాని దూడ మృతదేహాలను గుర్తించారు. వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పశువుల మృతదేహాలపై ఉన్న గాయాలు, పాదముద్రలు తదితర ఆధారాలను పరిశీలించిన అనంతరం ఇది పులి దాడి అని అధికారులు నిర్ధారించారు. అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండటం వల్ల వన్యప్రాణులు గ్రామ పరిసరాల్లోకి రావడం సాధారణమని అధికారులు పేర్కొన్నారు.ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా పశువులను మేతకు తీసుకెళ్లే కాపరులు, అటవీ ప్రాంతానికి వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది. అటవీg ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకుండా ఉండాలని, పశువులను సమూహంగా మేతకు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.

 

ప్రత్యేక అధికారి డి ఎన్ ఎన్ మూర్తి, సి సి ఎఫ్ కంటనాథరెడ్డి, డి ఎఫ్ ఓ లు శివకుమార్ గంగల్, రామచంద్రరావు, సబ్ డి ఎఫ్ ఓ సుబ్బారెడ్డి తదితరులు సంఘటనా స్థలంలో పర్యటించి పులి కదలికలపై సమీక్షిస్తున్నారు. పెద్దపులి కదలికలపై, బంధించేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సమాచారం. పెద్దపులి సంచారం పై అటవీ శాఖ సిబ్బందికి గ్రామస్తుల సహకరించాలని అధికారులు కోరారు .