చింతూరు, పెన్ పవర్, మార్చి 25:
చింతూరు మండలంలోని జువ్విగూడెం గ్రామంలో రైతన్న మీకోసం అన్నదాత సుఖీభవ కార్యక్రమం బుధవారం నిర్వహించబడింది. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా డోర్ టు డోర్ ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చింతూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ నేతృత్వం వహిస్తూ, రైతుల వద్దకు నేరుగా వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనాలను వివరించారు.
ప్రతి రైతు ఇంటిని సందర్శిస్తూ పథకం ద్వారా లభించే ఆర్థిక సహాయం, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి అంశాలను స్పష్టంగా తెలియజేశారు. రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని జమాల్ ఖాన్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కూడా అన్నదాత సుఖీభవ పథకం ప్రాముఖ్యతను వివరించి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని డోర్ టు డోర్ ప్రచారాన్ని విజయవంతం చేశారు.