ఉత్తమ మార్గదర్శి అవార్డు అందుకున్న నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగా వెంకటకృష్ణారావు
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం పి4 జీరో పావర్టీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావుకు ఉత్తమ మార్గదర్శి పురస్కారం అందజేశారు. ఈ అవార్డును నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, బిసి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర చేతుల మీదగా అందజేశారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రూపొందించబడిన పి4 (పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్ షిప్) మోడల్లో ఈ పథకం ద్వారా ఆర్థికంగా బలమైన వ్యక్తులు, వెనుకబడిన కుటుంబాలకు మార్గదర్శకులుగా మారి, వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కృష్ణారావు నర్సీపట్నం నియోజకవర్గంలో పలు గ్రామాలలో పేద కుటుంబాలను దత్తత తీసుకుని, వారికి ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్య సేవలను అందిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలిచారు. ఆయన సేవలు పి4 కార్యక్రమానికి విశేష ప్రోత్సాహాన్ని అందించాయి. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వెంకటకృష్ణారావు సేవలను అభినందిస్తూ యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ అవార్డు ఆయన చేసిన సామాజిక సేవలకు ఒక గుర్తింపుగా మాత్రమే కాకుండా మరింత సేవ చేయడానికి ప్రేరణగా నిలుస్తుందని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం తహశీల్దార్ ఎల్.రామారావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జడ్పీటీసీ సుకల రవణమ్మ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి లాలం శ్రీరంగస్వామి తదితరులు పాల్గొన్నారు.