PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 3:25 pm Posted By : YEDUKONDALU DADALA

ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘనంగా సాసా కార్యక్రమం

పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ – మండల అభివృద్ధిపై అధికారుల సమీక్ష

కాజులూరు, పెన్ పవర్, మార్చి 28:
కాజులూరు మండల ఎంపీడీవో జె. రాంబాబు ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర (సాసా) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మండల పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు సమావేశానికి హాజరై పరిశుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.అనంతరం అధికారులు భారీ ర్యాలీగా కాజులూరు ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు అందించారు.ఈ సమావేశంలో ఎంఈఓ–1 డేవిడ్, ఎంఈఓ–2 పులపకూర జాన్ ప్రత్యేకంగా పాల్గొని విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలు, పాఠశాలల పరిశుభ్రత,విద్యార్థులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు. ప్రతి నెల మూడవ శనివారం పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమాల ఫోటోలను సాసా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.మండలంలోని అభివృద్ధి పనులు, గ్రామ స్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవల పురోగతి, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో సమగ్రంగా సమీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీవో జె. రాంబాబు మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగవంతంగా మరియు సమర్థవంతంగా అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. కార్యాలయాలు, పాఠశాల ఆవరణల పరిశుభ్రతతో పాటు మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు సాసా కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏపీఎం రాము, జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీవో బి. వెంకటలక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి కె. ఈశ్వరి, జూనియర్ అసిస్టెంట్ మైథిలి, వెంకటేష్, వివిధ శాఖల సిబ్బంది, విద్యాశాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.