PEN POWER
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 12:18 pm Posted By : PEN POWER MEDIA

ఏపీలో మహిళా నియోజవర్గాలు..ఇవే

  • ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల సంఖ్య భారీగా పెరుగుదల
  • మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు దారి
  • ఏపీలో మహిళలకు 87 అసెంబ్లీ సీట్ల అవకాశం
  • పార్లమెంట్‌లో 13 సీట్లు మహిళలకు కేటాయింపు సూచనలు
  • మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్
  • భీమిలి టాప్‌లో.. మహిళా ఓటర్లలో ముందంజ
  • కీలక నగర నియోజకవర్గాల్లో మహిళల ప్రభావం పెరుగుదల
  • విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్‌లో మహిళల ఆధిక్యం
  • రాబోయే ఎన్నికల్లో మహిళా నాయకత్వానికి కొత్త అవకాశాలు

 

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు దిశగా అడుగులు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల పెరుగుదలతో మహిళా ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో—ఏ నియోజకవర్గాలు మహిళలకు కేటాయించబడతాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

స్టేట్ పొలిటికల్ బ్యూరో పెన్ పవర్| అమరావతి  | మార్చి25:

 

  దేశవ్యాప్తంగా నియోజకవర్గాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్డీఏ సమావేశంలో స్పష్టమైన సంకేతాలు అందాయి దీనిపై. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పునర్విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదించనున్నారు. అదే జరిగితే దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లతో పాటు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అయితే ఇప్పటికే మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తూ 2023లో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు పునర్విభజన బిల్లుతో పాటు మహిళా బిల్లును కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సంచలనంగా మారింది. పునర్ విభజనకు సంబంధించి ఏపీలో 50% చొప్పున అసెంబ్లీ, లోక్సభ సీట్లు పెరగనున్నాయి.ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనతో అసెంబ్లీ స్థానాలు 263, లోక్సభ సీట్లు 38 కి చేరుకుంటాయి. మహిళా ప్రాతినిధ్యం కూడా పెరగనుంది. వారికి 87 అసెంబ్లీ, 13 పార్లమెంట్ సీట్లు దక్కనున్నాయి. అయితే ఫలానా నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ చేస్తారని చెప్పడం కష్టం కానీ.. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను మాత్రం మహిళలకు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికం. వాటిని మహిళలకు రిజర్వ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.రాష్ట్రంలో ప్రధానంగా భీమిలి నియోజకవర్గం లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఏకంగా 1,65,570 మంది మహిళలు ఉండడం విశేషం. పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, రంపచోడవరం, పెందుర్తి, గురజాల, విశాఖపట్నం నార్త్,కోవూరు, కర్నూలు, విజయవాడ ఈస్ట్,విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్,గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, ఇచ్చాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి, రాజమహేంద్రవరం సిటీ,ప్రత్తిపాడు, రాజమహేంద్రవరం రూరల్, గుంతకల్లు, కాకినాడ సిటీ, పలమనేరు, విశాఖపట్నం ఈస్ట్, మాచర్ల,వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లి,పోలవరం, కావలి,జమ్మలమడుగు,కొత్తపేట, పాయకరావుపేట, శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు,ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు,ఆలూరు, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్, గూడూరు, ఒంగోలు, బనగానపల్లె,తాడిపత్రి నియోజకవర్గాల్లో మహిళలు అధికం.పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖపట్నంలో అత్యధికంగా 9,20,376 మంది మహిళలు ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, నంద్యాల,విజయవాడ, కర్నూలు,కాకినాడ, ఏలూరు, కడప, చిత్తూరు, రాజంపేట, శ్రీకాకుళం, అనకాపల్లి, హిందూపురం, రాజమండ్రి,ఒంగోలు, అరకు, విజయనగరం, మచిలీపట్నం, బాపట్ల, అమలాపురం, నరసాపురం పార్లమెంట్ స్థానాల్లో మహిళలు ఎక్కువ. మరి ఈ నియోజకవర్గాల్లో మహిళలకు ఛాన్స్ దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి.