కన్వీనర్ పోట్ల గోవింద్..
పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 31
పుల్లలచెరువు మండలంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద ఆర్థిక సహాయం అందజేశారు. పుల్లల చెరువు మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం బాధిత కుటుంబాలకు నూతన ధైర్యాన్ని నింపింది.పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన దండెబోయిన కోటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 1న విద్యుత్ షాక్కు గురై మృతి చెందగా, రాచకొండ పంచాయతీ పరిధిలోని ఆర్ ఉమ్మడి వరం గ్రామానికి చెందిన జెట్టిబోయిన వెంకయ్య 2025 ఆగస్టు 20న వినుకొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పనిచేసిన నిబద్ధత గల కార్యకర్తలని నాయకులు గుర్తుచేశారు.ఈ విషాద ఘటనల నేపథ్యంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని, పార్టీ ప్రమాద బీమా పథకం కింద ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. ఆయన సూచనల మేరకు మండల నాయకులు బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా పోట్ల గోవింద్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి వెన్నెముక. వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. కష్టసమయంలో కుటుంబాలకు తోడుగా నిలవడం మా బాధ్యత అని తెలిపారు. కార్యకర్తల పట్ల పార్టీకి ఉన్న ఆప్యాయత, నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు.పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, యువనేత నారా లోకేష్ మార్గదర్శకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా కార్యకర్తల భద్రత, సంక్షేమంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.చెక్కులు అందుకున్న కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనై, తమ కష్టసమయంలో అండగా నిలిచిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, గూడూరి ఎరిక్షన్ బాబు పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ సహాయం మాకు పెద్ద ఊరట ఇచ్చింది. పార్టీ మాకు అండగా ఉందనే నమ్మకం కలిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కార్యదర్శి కాకర్ల కోటయ్య, మండల మాజీ అధ్యక్షుడు పల్లపాటి బాదరయ్య, నాయకులు పాతకోటి రామిరెడ్డి, శనగా వెంకటేశ్వర రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కేశనపల్లి బక్కయ్య పాల్గొన్నారు.