గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందొద్దు
-టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్
నర్సీపట్నం, పెన్ పవర్ :
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత వస్తుందన్న వదంతులతో ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కోరారు. మంగళవారం నర్సీపట్నంలో స్థానిక తహశీల్దార్, పౌరసరఫరాల శాఖ సిబ్బంది, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమై క్షేత్రస్థాయిలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యుద్ధం కారణంగా నౌకల రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేక అవసరం లేకపోయినా ముందస్తుగా అదనపు సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారని, దీనివల్ల అత్యవసరమైన వారికి సప్లైలో ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. కరోనా సమయంలో ఎదురైన పానిక్ పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గ్యాస్ కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం ఏజెన్సీల వద్ద టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో డిమాండ్, సప్లైల మధ్య ఉన్న వ్యత్యాసంపై కలెక్టర్, జేసీ, ఆర్డీవో తదితర అధికారులతో చర్చించి, స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి ఈ నివేదికను తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహశీల్దార్ రామారావు, జడ్పిటిసి రమణమ్మ, లాలం శ్రీరంగస్వామి, పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.