గ్రామ గ్రామాన జనసేన బలోపేతానికి ఐక్యంగా కృషి
బలమైన శక్తిగా ఎదుగుదాం
రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య
స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,మార్చి 25:
గ్రామ గ్రామాన జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదగాలంటే కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా. వంపూరు గంగులయ్య పిలుపునిచ్చారు. బుధవారం పాడేరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదులో చురుకైన పాత్ర పోషించిన సాధకులను ఈ సందర్భంగా అభినందించారు. పార్టీ నిర్మాణంలో ప్రతి కార్యకర్త కీలక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వంతల సుబ్బారావు, సీదరి రామ్మూర్తి పార్టీలో చేరికతో కొత్త ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. నాయకులు తమ తమ మండలాలు, గ్రామాలకు పరిమితం కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం కట్టుబడి పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. డబ్బు, పదవులు ఆశించకుండా సమాజ మార్పు కోసం ఆయన చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గిరిజనుల అభివృద్ధికి ఆయన చూపుతున్న చొరవ, కేటాయిస్తున్న నిధులు పార్టీకి బలమైన ఆధారమని పేర్కొన్నారు.స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో జనసేన గెలుపు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని, అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా పాడేరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం వ్యూహరచన చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు గొర్లె వీర వెంకట్, మండల అధ్యక్షులు నండోలి మురళీకృష్ణ, మాసాడి భీమన్న, ఐటీ ఇన్చార్జి సాలేబు అశోక్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.