PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:39 pm Posted By : M CHANTI BABU

ఘాట్ మలుపులో బ్రేక్ ఫెయిల్… బోల్తా పడ్డ అంబులెన్స్ – నలుగురికి గాయాలు

ఘాట్ మలుపులో బ్రేక్ ఫెయిల్… బోల్తా పడ్డ అంబులెన్స్ – నలుగురికి గాయాల

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, మార్చి 23:మండలంలోని జర్రెల ఘాట్ రోడ్డులో సోమవారం రాత్రి అంబులెన్స్ ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు విఫలమవడంతో అదుపుతప్పిన అంబులెన్స్ రోడ్డుపక్కకు ఒరిగి బోల్తా పడటంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యుడు మణిదీప్ తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మి అనే రోగిని మెరుగైన చికిత్స కోసం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులోని ప్రమాదకర దిగువ మలుపు వద్దకు చేరుకునే సమయంలో వాహనం బ్రేకులు అకస్మాత్తుగా విఫలమయ్యాయి.వాహనాన్ని అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ, వేగం తగ్గకపోవడంతో అంబులెన్స్ రోడ్డుపక్కకు ఒరిగి బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మి, చిన్నారావు, సీతమ్మ, రూపలు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదం అనంతరం సమీప గ్రామాల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం క్షతగాత్రులను మరో వాహనంలో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాలు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అంబులెన్స్ సాంకేతిక లోపాలు, ముఖ్యంగా బ్రేక్ వ్యవస్థపై విచారణ కొనసాగుతోంది. ఘాట్ రోడ్లలో వరుసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో వాహనాల ఫిట్‌నెస్ తనిఖీలు కఠినంగా నిర్వహించాలని, ప్రమాదకర మలుపుల వద్ద రక్షణ గోడలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.