చింతూరు, పెన్ పవర్ మార్చి 26:
జిల్లా హాస్పిటల్ సేవల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డా. నీలవేణి చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సీ)ను ఆకస్మికంగా సందర్శించి, ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్ని వార్డులను పరిశీలించి, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సేవలు, నిర్వహణ పరిస్థితులను సమీక్షించారు. స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)ను సందర్శించి, అక్కడ నిర్వహణ బాగుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం డయాలిసిస్ కేంద్రాన్ని తనిఖీ చేసి, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆసుపత్రి సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా అన్ని వైద్య పరికరాలను తనిఖీ చేయగా, అవి సక్రమంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆసుపత్రి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన డీసీహెచ్ఎస్, వైద్యులు, సిబ్బంది కృషిని ప్రశంసించారు.
భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నాణ్యమైన సేవలు అందిస్తూ, రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. ఎం.వి. కోటిరెడ్డి, డా. రమణరావు (గైనిక్), డా. భరద్వాజ్, డా. స్పందన, డా. రామలక్ష్మీనారాయణ (ఎస్ఎన్సీయూ మెడికల్ ఆఫీసర్), హెడ్ నర్స్ కుమారి తదితరులు పాల్గొన్నారు.