సండ్రి మార్కెట్ వేలం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది
చిలకలూరిపేట: స్థానిక పురపాలక సంఘం పరిధిలోని వివిధ మార్కెట్ల నిర్వహణ హక్కుల కోసం బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు పర్యవేక్షణలో ఆయన ఛాంబర్లో జరిగిన ఈ వేలంలో రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరి పాల్గొన్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి మున్సిపాలిటీకి ఆదాయం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
మాంసం, చేపల మార్కెట్ నిర్వహణ హక్కుల కోసం జరిగిన వేలంలో గత ఏడాది (2025-26) ₹1,76,500 ఆదాయం రాగా, ప్రస్తుత ఏడాది (2026-27) ₹1,81,000కు పెరిగింది. దీంతో ₹4,500 అదనపు ఆదాయం లభించింది.
పట్టణంలోని ప్రధాన మార్కెట్ అయిన చంద్రమౌళి కూరగాయల మార్కెట్ వేలంలో గత ఏడాది ₹12,20,000 ఆదాయం రాగా, ఈసారి ₹12,40,000కు చేరింది. దీంతో ₹20,000 అదనంగా సమకూరింది.
ఇక సండ్రి మార్కెట్ వేలం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ మార్కెట్కు సంబంధించిన వేలాన్ని ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. గత ఏడాది ఈ మార్కెట్ ద్వారా ₹16,30,000 ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి మరింత ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.