నర్సీపట్నంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న స్పీకర్
నర్సీపట్నం, పెన్ పవర్ :
స్థానిక కాపువీధిలోని శ్రీశ్రీశ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎపి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు సన్నాయి మేళం మరియు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, మహా పూర్ణాహుతి కార్యక్రమాల్లో వారు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు స్పీకర్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి వారిని ఘనంగా సత్కరించారు. నర్సీపట్నం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ నేతేటి శరత్ కుమారాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కొల్లానా పరదేశినాయుడు, గొలుసు నరసింహమూర్తి, బలిజి బుజ్జి, దాడి శ్రీను, పెదరెడ్ల నాగేశ్వరావు, గోలజానా రాజు తదితరులు పాల్గొన్నారు.