PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 12:30 pm Posted By : SIVA KUMAR LANKA

నర్సీపట్నం మరిడమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

నర్సీపట్నం మరిడమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

-స్పీకర్ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, పెన్ పవర్ :

​నర్సీపట్నంలో ఈ నెల 31, ఒకటవ తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ మరిడమ్మ అమ్మవారి పండగకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వి.వి. రమణ, డిఎస్పి శ్రీనివాస్ మరియు ఎనిమిది శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. లక్ష మందికి పైగా హాజరయ్యే ఈ వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెవెన్యూ, పోలీస్, వైద్య, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. రాత్రి వేళల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల దృష్ట్యా మహిళలు, పిల్లల భద్రత కోసం సుమారు 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, అలాగే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనంగా 100 మంది కార్మికులను రప్పించడంతో పాటు, త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఆరు వాటర్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. విద్యుత్ అంతరాయం కలగకుండా విశాఖ నుంచి 8 భారీ జనరేటర్లు సిద్ధం చేశామని, అగ్నిమాపక సిబ్బందిని సైతం అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ప్రజలందరూ సహకరించి ఈ పండగను విజయవంతం చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు.