సీతానగరం, పెన్ పవర్, మార్చి24:
గ్రామాలు, వార్డుల్లో పోలీసులు నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమంతో ప్రజలకు మరింత భరోసా కల్పిస్తున్నామని ఎస్సై డి. రామ్ కూమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ నార్త్ డి.ఎస్.పి రామకృష్ణ కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ వి.వి. ఎస్ మూర్తి పర్యవేక్షణలోమంగళవారం రాత్రి సీతానగరం మండలంలోని పోలీసుస్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, గ్రామాల కానిస్టేబుళ్లు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడమే పల్లె నిద్ర ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు పెద్ద నేరాలుగాను, శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశముందని, ఇలాంటి అంశాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, చర్యలు చేపడు తున్నామన్నారు. పోలీసు స్టేషన్లుకు వెళ్ళకుండానే వారి సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు తెలిపేందుకు ‘పల్లెనిద్ర’ ఒక వేదికగా నిలుస్తుంద న్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విషయాలను, గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల మధ్యగల విభేదాలను, భూతగాదాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు, ప్రజలకు రక్షణగా నిలిచే చట్టాలు, సైబర్ మోసాలు, మహిళలు, రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.