PEN POWER
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 10:52 am Posted By : PEN POWER MEDIA

పార్టీ పునర్నిర్మాణానికి జగన్ కొత్త స్ట్రాటజీ

  • స్క్రిప్ట్ లేకుండా మాట్లాడిన జగన్… వైసీపీలో కొత్త సంకేతాలు
  • కోటరీ రాజకీయాలకు చెక్ పెట్టనున్న జగన్?
  • కోటరీకి బ్రేక్… కార్యకర్తల వైపు జగన్ అడుగు
  • కార్యకర్తలతో నేరుగా టచ్ అవసరం
  • ఆవిర్భావ దినోత్సవ వేదికపై కొత్త సంకేతాలు
  • జిల్లాల వారీగా సమీక్షలు అవసరం అంటున్న కార్యకర్తలు

పార్టీ చుట్టూ ఏర్పడిన కోటరీ రాజకీయాలు వైసీపీకి దూరం పెంచాయని భావిస్తున్న క్యాడర్ మధ్య ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆవిర్భావ దినోత్సవ వేదికపై స్క్రిప్ట్ లేకుండా మాట్లాడిన వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు పార్టీ లోపల కొత్త సంకేతాలను పంపింది. కోటరీని పక్కన పెట్టి కార్యకర్తలతో నేరుగా కనెక్ట్ కావాలనే సంకల్పం జగన్‌లో కనిపిస్తోందా? లేక ఇది ఒక్కరోజు మార్పేనా అన్న చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

స్టేట్ పొలిటికల్ బ్యూరో , పెన్ పవర్ , విజయవాడ, మార్చి 16

వైసీపీ అధినేత జగన్ కోటరీని పక్కన పెట్టాలని ఆ పార్టీలో .. పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి క్యాడర్ వరకూ కోరుకుంటున్నారు. జగన్ నేరుగా అందరితో టచ్ లో ఉండకపోవచ్చు కానీ అసలు మొత్తం ఆయన తరపున కోటరీలో కీలక వ్యక్తులుగా చెలామణి అవుతున్న నేతలే చక్కబెడుతున్నారు. జగన్ కు తెలుస్తుందో లేదో కూడా క్యాడర్ కు తెలియడం లేదు. అయితే రెండు రోజుల కిందట జరిగిన ఆవిర్భావ దినోత్సవం రోజున కొద్ది సేపే అయినా స్క్రిప్ట్ లేకుండా ప్రసంగించడం, ఆ కార్యక్రమంలో ఆయన పక్కన కోటరీ నేతలెవరూ లేకపోవడం పార్టీ క్యాడర్ లో ఆశలు నింపుతోంది. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేదికగా జగన్ తీరులో కనిపిస్తున్న మార్పు ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా జగన్ అంటేనే చుట్టూ ఒక ప్రత్యేక కోటరీ ఉంటుంది. ఆ కోటరీని దాటుకుని సామాన్య కార్యకర్త వెళ్లడం అసాధ్యమనే ముద్ర పడిపోయింది. గత ఐదేళ్లుగా జగన్ తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఆ ముగ్గురు నలుగురు కీలక నేతల పాత్రే ఎక్కువగా ఉందనే అసహనం పార్టీలో ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు జగన్ దృష్టికి వెళ్లకుండా ఈ కోటరీ అడ్డుపడుతోందని సీనియర్ నేతలు సైతం లోలోపల మదనపడుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అసంతృప్తి మరింత పెరిగింది. కోటరీకి ఉన్న అతి సాన్నిహిత్యం వల్ల పార్టీ నేతల మధ్య దూరం పెరిగిందని క్యాడర్ గట్టిగా నమ్ముతోంది. ఇప్పుడు జగన్ ఈ వర్గాన్ని పక్కన పెడుతున్నట్లు కనిపిస్తుండటం కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. సాధారణంగా జగన్ ప్రసంగాలు పక్కాగా రాసి పెట్టుకున్న కాగితాల చుట్టూ సాగుతుంటాయి. కానీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన ఏ కాగితం చూడకుండా మనసులో ఉన్నది మాట్లాడారు. ఇది నాయకత్వ శైలిలో మార్పును సూచిస్తోంది. నేరుగా ప్రజలతో కార్యకర్తలతో కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో సలహాదారులు ఉండకూడదని జగన్ గుర్తించినట్లు కనిపిస్తోంది. కోటరీ చెప్పే లెక్కల కంటే కార్యకర్తల ఆవేదన వింటేనే పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఈ ప్రసంగం ద్వారా అర్థమవుతోంది. కేవలం ఒక రోజు వేడుకతోనే ఈ మార్పు ఆగిపోతే ఫలితం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. సలహాదారులు ఇచ్చే సమాచారంపైనే ఆధారపడకుండా జిల్లాల వారీగా ముఖ్య నేతలు కింది స్థాయి కార్యకర్తలతో జగన్ నేరుగా టచ్ లో ఉండాలి. లోటస్ పాండ్ లో లేదా తాడేపల్లిలో గదుల మధ్య జరిగే సమీక్షల కంటే క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని క్యాడర్ ఆశిస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచారని కోటరీని దూరంగా పెట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడి చుట్టూ ఉండే వ్యక్తుల కంటే జెండా మోసే కార్యకర్తలే శ్రీరామరక్ష అని జగన్ కి ఆలస్యంగానైనా అర్థమైందన్న భావన వ్యక్తమవుతోంది. జగన్ తనంతట తానుగా బయటకు వచ్చి ప్రజలతో మమేకమైతే అటు ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలోనూ ఇటు పార్టీని బలోపేతం చేయడంలోనూ వేగం పెరుగుతుందని అనుకోవచ్చు. మరి ఇదే పద్ధతిని ఆయన భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా లేక మళ్లీ పాత సలహాదారుల మాయలో పడతారా అన్నది వేచి చూడాలి.