PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:40 pm Posted By : YEDUKONDALU DADALA

పిఠాపురం పట్టణ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత – మంత్రి నారాయణ

కాకినాడ/పిఠాపురం, పెన్ పవర్,మార్చి 23,
పిఠాపురం పట్టణంలో తాగునీరు, డ్రైన్స్, సీసీ రోడ్లు, వీధీ దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి మౌలిక వసతుల పనులకు తొలి ప్రాధాన్యతనిచ్చి వేగంగా అమలు చేస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.సోమవారం కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురంలో పర్యటించిన మంత్రి నారాయణ, మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, ఆర్డీఎంఏ ప్రాంతీయ అధికారి సీహెచ్ నాగ నరసింహారావు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పాడా పీడీ బీహెచ్ భవానీ శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమృత్ పథకం ద్వారా పిఠాపురంలో రూ.60 కోట్లు, గొల్లప్రోలులో రూ.80 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.అలాగే పిఠాపురంలో రూ.14.6 కోట్లు, గొల్లప్రోలులో రూ.8 కోట్లతో గృహ వినియోగ జలాలను శుద్ధి చేసి బయటకు పంపించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రెయిన్లు, సీసీ రోడ్లు, పార్కులు, వీధిలైట్లు పనులను రాబోయే రెండేళ్లలో 100 శాతం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఇరిగేషన్ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి, వచ్చే ఆరు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మున్సిపాలిటీల్లో డివిజన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు.ఈ సమావేశంలో పిఠాపురం కమిషనర్ ఎన్. కనకారావు, గొల్లప్రోలు కమిషనర్ పీ. శ్రీనివాసు, ఇరిగేషన్, శానిటేషన్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.