PEN POWER
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 9:53 pm Posted By : SRIKANTH NARASIMHALA

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సిపిఐ పోరాటం

ఎన్నిక‌ల హామీని నెర‌వేర్చాలి 24న జ‌రిగే అందోళ‌న‌కు త‌ర‌లిరావాలి

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 :

చిలకలూరిపేట : ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేరకు పేద‌ల‌కు నివేశ‌న స్థ‌లాలు అంద‌జేయాల‌ని సీపీఐ ఏరియా కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేర‌కు ఈ నెల 24వ తేదీ నివేశన స్థ‌లాలు అంద‌జేయాల‌ని నిర్వ‌హించనున్న ఆందోళ‌న కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా ఆదివారం ప‌ట్ట‌ణంలోని 26వ వార్డు వ‌డ్డెర కాల‌నీలో పేద‌ల నుంచి నివేశ‌న స్థ‌లాల అర్జీల‌ను స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఇచ్చింద‌ని గుర్తు చేశారు. ప‌ట్ట‌ణంలోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళు, ఇళ్లస్థలాల సాధన కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందని బాబురావు చెప్పారు. గత 2024 ఎన్నికల సమయంలో ఇళ్ళు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల నివాస స్థలం ఇస్తామని, ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి కూటమి నేతలు అధికారంలోకి వచ్చారని తెలిపారు. అధికారం చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా సెంటు భూమి పంచకుండా నిర్లక్య వైఖరిని ప్రదర్శిస్తూ, వేలాది ఎకరాలు అప్పనంగా కార్పొరేట్ సంస్ధలకు దోచిపెడుతూ పేదలను విస్మరించడం దుర్మార్గమని మండిపడ్డారు. సొంతంటి కలను సాకారం చేసుకునేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పేదలకు న్యాయం చేసే వరకు పోరాడతామని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సీపీఐ పోరాడుతునే ఉంటుంద‌ని స్స‌ష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్థాలు గడిచిన పేదలు నివాసం ఉండేందుకు నేటికి ఇళ్ల స్థలాలకు పేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగటం విచారకరం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ప్రజల ఆర్ధికాభివృద్ధికి జీవన స్థితిగతులు మార్చేందుకు చర్యలు తీసుకోవటంలో నానాటికి విఫలమవుతుందన్నారు. ఒకే ఇంటిలో నాలుగు ఐదు కుటుంబాలు కలిసి జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వాలు ఆలోచన చేయటంలేదన్నారు. ఈ నెల 24వ తేదీ జ‌రిగే ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని,సీపీఐ పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల,ఏఐవైఎఫ్‌ నియోజకవర్గ కార్యదర్శి కె. మల్లికార్జున్, బొంతా నాగేశ్వరరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.