4184 మంది విద్యార్థులు హాజరు కానున్నారు – ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు
గంగంగవర-పెన్ పవర్: పోలవరం జిల్లాలో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.జిల్లా పరిధిలోని రంపచోడవరం, చింతూరు డివిజన్లలో మొత్తం 105 పాఠశాలల నుండి 4184 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పరీక్షల నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు 32 మంది చీఫ్ సూపరింటెండెంట్లు (CS), 32 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు (DO) ను నియమించినట్లు డీఈవో వెల్లడించారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమబద్ధంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి రవాణా ఇబ్బందులు లేకుండా పాఠశాల నుండి పరీక్షా కేంద్రం వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా పరీక్షలకు హాజరై మంచి ఫలితాలు సాధించాలని ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు ఆకాంక్షించారు.