*జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన ఎమ్మెల్యే శిరీషాదేవి*
గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 30:
పోలవరం జిల్లా వైశాల్యంలో చాలా పెద్దదని దాని అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను రంప చోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంపచోడవరం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆమె నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ దినేష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నెలకొన్న పలు కీలక విషయాలు పై చర్చించారు. గిరిజన ప్రాంత సమగ్రాభివృద్ధి కొరకు విద్యా, వైద్యం, మౌళిక వసతుల కల్పన, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న పలు సమస్యలు, ఆర్థికాభివృద్ధికి పలు పరిశ్రమలు ఏర్పాటు పై క్షుణ్ణంగా వివరించారు. కుల దృవీకరణ పత్రాల మంజూరులో కొన్ని గిరిజన తెగలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులపై కలెక్టర్ కి , జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బచ్చు స్మరణ రాజ్ లకు వివరించారు.

దీనిపై స్పందిస్తూ పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత, రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు స్వప్న కుమారి, తెదేపా సీనియర్ నాయకులు గణజాల తాతారావు తదితరులు ఉన్నారు.