PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 9:03 pm Posted By : SRIKANTH NARASIMHALA

ప్రాణాలు పోతున్నా చర్యలు లేవా?

మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ఎంఆర్‌పీఎస్ ఆగ్రహం

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 :

చిలకలూరిపేట : మార్కాపురం సమీపంలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంపై ఎంఆర్‌పీఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మార్గదర్శకత్వంలో పల్నాడు జిల్లా టౌన్ కార్యాలయంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ మాట్లాడుతూ.. జగిత్యాల నుండి కనిగిరి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 13 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. కేవలం సానుభూతి ప్రకటనలతో సరిపెట్టకుండా, మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 10 లక్షల పరిహారం వెంటనే అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వారి పిల్లలకు ఉచిత విద్య, నివాస గృహాలు, మరియు సాగుభూమి కల్పించాలని కోట సుబ్బు మాదిగ విన్నవించారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై ఉక్కుపాదం మోపాలని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల జార్జ్, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పలుకూరి రామారావు మాదిగతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.