PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 3:40 pm Posted By : YEDUKONDALU DADALA

బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో జయ ప్రవేశపు పండుగ

రామచంద్రపురం పెన్ పవర్, మార్చి 29:

రామచంద్రపురం పట్టణంలో యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో జయప్రవేశపు ఆదివారం (పామ్ సండే) సందర్భంగా విశేష భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మట్టలకు పువ్వులు గుచ్చి, కీర్తనలు పాడుతూ పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.సంఘ పాస్టర్ రెవరెండ్ ఎం. రాజ్ కుమార్ మాట్లాడుతూ, క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో జయప్రవేశపు ఆదివారం ఒక ముఖ్యమైన రోజు అని తెలిపారు. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే ఈ ఆదివారం, సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు గారు గాడిద పిల్లపై కూర్చొని యెరూషలేము నగరంలో ప్రవేశించిన సందర్భాన్ని స్మరించుకుంటూ జరుపుకుంటారని వివరించారు. ఆ సమయంలో ప్రజలు ఖర్జూరపు మట్టలు, వస్త్రాలు దారి పొడవునా పరిచి జయకీర్తనలు పాడిన ఘటనను గుర్తుచేసుకుంటూ ఈరోజు మట్టలతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
సంఘ అధ్యక్షులు గొల్ల కమల్ శేషు మాట్లాడుతూ, ఎల్ఐసీ కార్యాలయం వద్ద నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రధాన రహదారిపై సంఘ సభ్యులు, సండే స్కూల్ పిల్లలు, స్త్రీల సమాజం, యువజన సంఘం కలిసి కీర్తనలు పాడుతూ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం సంఘంలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా సంఘ ప్రాంగణంలో త్రాగునీటి కోసం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వృద్ధులు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారికి సౌకర్యంగా ఉండేలా ర్యాంపును కూడా ప్రారంభించారు. త్వరలో పట్టణంలో క్రైస్తవ గ్రంథాలయం ఏర్పాటు చేసి, ప్రేయర్ టవర్‌లో ప్రార్థనలు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ర్యాలీ నిర్వహణకు అనుమతి ఇచ్చిన పోలీసు అధికారులకు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ వాకపల్లి శామ్యూల్, ట్రెజరర్ అంబటి డేవిడ్ రాజ్, ఉపాధ్యక్షులు చిందాడ మోజస్విక్సన్, ఉప కార్యదర్శి గుమ్మడి బెనర్జీ, సండే స్కూల్ సూపరింటెండెంట్ జి.ఎస్. అమృతవల్లి, స్త్రీల సమాజ అధ్యక్షులు డి. ప్రశాంతి చరణ్, యూత్ కమిటీ అధ్యక్షులు వి. రాజా రమేష్ కుమార్, సంఘ కౌన్సిల్ సభ్యులు మరియు విశ్వాసులు పాల్గొన్నారు.