చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 20:
చిలకలూరిపేట: మండలంలోని బొప్పిడి గ్రామంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించగలమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. శనివారం చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని నక్షత్ర వనము ను ఆయన తన సతీమణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నక్షత్ర వనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన స్వయంగా మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్వగ్రామంపై మమకారంతో పాటు, పర్యావరణం పట్ల గ్రామ ప్రజలు చూపుతున్న శ్రద్ధఅభినందనీయమని కొనియాడారు. నక్షత్ర వనం వంటి ఆధ్యాత్మిక మరియు పర్యావరణ మేళవింపు ఉన్న ప్రాంతాలు మానసిక ప్రశాంతతకు ఎంతోదోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.