చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 23 :
చిలకలూరిపేట: పట్టణ ప్రజలు పన్నులు చెల్లించే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ పురపాలక సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆదేశాలు, ఆర్.ఓ. సుబ్బారావు సూచనల మేరకు మున్సిపల్ ఆర్.ఐ. అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో ‘మొబైల్ కౌంటర్’ సేవలను ప్రారంభించారు. ఈ మొబైల్ కేంద్రం ద్వారా ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి లేదా సచివాలయాలకు వెళ్లే పనిలేకుండా, ఉన్న చోటే కేవలం రెండు సెకన్లలో పన్ను కట్టి రిసిప్ట్ పొందే వెసులుబాటు కల్పించారు.
ఈ సందర్భంగా ఆర్.ఐ. అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ, పన్నుల వసూళ్లను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు శ్రమ తగ్గించడమే ఈ మొబైల్ కౌంటర్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రోడ్డుపై వెళ్లేటప్పుడైనా లేదా తమ నివాసాల వద్దకు ఈ కౌంటర్ వచ్చినప్పుడైనా పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే పలువురు ఈ సేవలను వినియోగించుకోగా, తక్షణమే రిసిప్ట్ అందుతుండటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.