వేడుకలపై ఎక్సైజ్ శాఖ అప్రమత్తం
హయత్ నగర్ & పెద్ద అంబర్పేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సి. ఐ ధన్వంత రెడ్డి
హయత్నగర్, పెన్ పవర్ మార్చి 29:
వేడుకల సందర్భంగా చట్ట విరుద్ధ మద్యం వినియోగం, డ్రగ్స్ వాడకం నివారించేందుకు ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. ఫంక్షన్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్, రిసార్ట్స్, ఫార్మ్ హౌస్లలో జరిగే ఈవెంట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.డిఫెన్స్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఇతర రాష్ట్రాల మద్యం), విదేశీ మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగంపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీలలో ఎస్టీఎఫ్ (స్టేట్ టాస్క్ ఫోర్స్), రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ (సరూర్నగర్ జిల్లా టాస్క్ ఫోర్స్), హయత్నగర్ మరియు పెద్ద అంబర్పేట్ ఎక్సైజ్ బృందాలు పాల్గొని నిరంతర తనిఖీలు నిర్వహించనున్నాయి.వేడుకల్లో మద్యం వినియోగానికి తప్పనిసరిగా ఈవెంట్ పర్మిట్ ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ మద్యం మినహా ఇతర రాష్ట్రాల మద్యం, డిఫెన్స్, విదేశీ మద్యం లేదా నిషేధిత పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే, మద్యం వినియోగాన్ని గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ యాప్ల సహాయంతో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఫంక్షన్ హాల్, రిసార్ట్ యజమానులు ఈవెంట్ పర్మిట్ లేకుండా కార్యక్రమాలు నిర్వహించకుండా చూడాలని, చట్టవిరుద్ధ మద్యం వినియోగాన్ని నివారించడం వారి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత హాల్ను బ్లాక్లిస్ట్ చేసి, భవిష్యత్తులో ఈవెంట్ పర్మిట్ ఇవ్వబోమని సి.ఐ ధన్వంత రెడ్డి స్పష్టం చేశారు.