21 వాహనాలు, 14 ఆయుధాలు స్వాధీనం
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 28:
చిలకలూరిపేట : పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట డివిజన్ పరిధిలోని చిలకలూరిపేట రూరల్ మండలం వేలూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో సబ్డివిజన్ పరిధిలోని సి.ఐలు, ఎస్.ఐలు మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి వీధిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు, సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 14 ప్రాణాంతక ఆయుధాలను కూడా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం విద్యార్థులు గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలవుతుండటం ఆందోళనకరమని పేర్కొంటూ, అలాంటి అలవాట్లకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
“ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు.