PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 11:32 pm Posted By : Sathish Bede

వైభవంగా సీతారాముల కళ్యాణం

చింతూరు, పెన్ పవర్ మార్చి 27:

స్థానిక శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ ప్రాంగణాన్ని సాంప్రదాయబద్ధంగా చలువ తాటాకు పందిర్లతో అలంకరించి, భక్తుల కోసం బెల్లం పానకం ఏర్పాటు చేశారు. భజన బృందాలు సీతారాముల కల్యాణ గీతాలను ఆలపించాయి. సుందరంగా అలంకరించిన శ్రీరామ, సీతమ్మ, లక్ష్మణుల విగ్రహాల సమక్షంలో కళ్యాణ తంతు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక గిరిజనుల సహకారంతో ఆలయ పరిసరాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. మండలంలోని పలు గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు పలు చోట్ల బెల్లం పానకం పంపిణీ చేయగా, ఆలయ కమిటీ తరఫున పులిహోర ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా చింతూరు డివిజన్‌కు చెందిన ఎస్సై రమేష్ దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికుల మధ్య ఆయన కుటుంబానికి మంచి పరిచయం ఉండటంతో, వారి పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో మంగళధారణ, తలంబ్రాల కార్యక్రమాలు నిర్వహించగా, మేళతాళాల మధ్య కార్యక్రమం ఘనంగా సాగింది. శబరి నది పరివాహక ప్రాంతమైన చింతూరు పరిసరాలు రామాయణానికి సంబంధించిన ప్రాధాన్యతను కలిగి ఉండటంతో, ఈ కళ్యాణానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏర్పడింది.