షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియకాల చట్టం చేయాలి
ఆదివాసీ సత్యాగ్రహ యాత్రలో జెఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ రాజుబాబు డిమాండ్
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 20:
షేడ్యూల్డ్ ప్రాంత ఉద్యో నియమకాల చట్టం చేయాలని ఏప్రిల్ 3 న పాడేరులో జరిగే ఆదివాసీ సత్య గ్రహయాత్ర భారీ ర్యాలీని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,అల్లూరి సీతరామరాజు జిల్లా చైర్మన్ రామరావుదొర పిలుపునిచ్చారు.
మండలంలోని డేరాల గ్రామం నుంచి ఆదివాసి సత్యాగ్రహ యాత్రను ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రామరావుదొర మాట్లాడుతూ సత్య గ్రహాయాత్ర ఈ రోజుతో 130 వ రోజుకు చేరుకుందని, రాష్ట్రంలో అనేక గ్రామాలను పర్యటిస్తూ, షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకల చట్టం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసి నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసం ఆదివాసి ప్రాంత ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసీలకే కల్పించేలా చట్టం చేస్తామని పలు సందర్భాల్లో ఆదివాసి ప్రాంతాల పర్యటన లో హామీ ఇచ్చి ఇప్పుడు మరిచిపోయారన్నారు. 2025 ఆగస్టు 9 న పాడేరు లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఈ చట్టం చేస్తామని ఆదివాసి జేఏసీ కి, ఆదివాసులకు హామీ ఇచ్చారన్నారు. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం చేసేంతవరకు ఆదివాసులందరూ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.
ఈ చట్టం చేయడం ఆదివాసులకు చారిత్రక అవసరమే కాదు కూటమి ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత కూడా అని రామారావు దొర అన్నారు. అలాగే ఏజెన్సీ చట్టాలు రాజ్యాంగ పరిధులు పరిగణలోకి తీసుకొని షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం కూర్పు లో స్టేట్ కేడర్ పోస్టులలో 30శాతం, జోనల్ కేడర్ పోస్టులలో 50శాతం, లోకల్ కేడర్ పోస్టులన్నిటిని స్థానిక ఆదివాసీలతో భర్తీ చేసే విధంగా సమగ్రమైన చట్టం చేయాలని పలుదఫాలుగా ప్రభుత్వం తో జరిపిన చర్చలలో ఆదివాసి జేఏసీ స్పష్టం చేసింది, ఇప్పటికైనా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం చేయకపోతే, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మరో మారు ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరగనుందని ఆదివాసి జేఏసీ హెచ్చరిస్తుంది. కావున కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే , షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం చేయకపోతే ఆదివాసి జేఏసీ ఉద్యమాలు తీవ్రతరం చేసి ప్రభుత్వనికి డిమాండ్ చేస్తామని హెచ్చరించారు.ఆదివాసీ జెఎసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు మాట్లాడుతూ జిఓ నెంబర్ 3 రద్దు చేయడంతో ఆదివాసీలకు తీవ్ర నష్టం జరిగిందని, గిరిజన సలహా మండలి (టిఎసి)ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ చట్టాలైనా భూబదాలయింపు నిషేధ చట్టం,పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం, ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టాలను సక్రమంగా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసీ నాయకులు లకే రామచంద్రుడు,జెఎసి మీడియా ప్రతినిధి మరియు గిరిజన విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్షుడు మణుగూరు బాబుజీ, పార్థసారథి,స్వామి మరియు మొట్టడం రామరావు, వనపల జోగిరాజు,లకే ఈశ్వరి, వనపల దేవేంద్రతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.డేరాల, గూడెం కోలనీ, ఆర్వీనగర్, వంచుల, కొత్తపాలెం, జర్రెల, మొండిగెడ్డ,రింతాడ, సంకాడ, పెదవలస,డొకులూరు,లక్కవరపుపేట, దేవరాపల్లి తో పాటు వివిధ గ్రామాలకు ఆదివాసి సత్యాగ్రహ యాత్ర రధం వెళ్లి ఏప్రిల్ 3 వ తారీకున పాడేరులో జరిగే ర్యాలీ విజయవంతం చేయాలని ప్రచారం చేసారు.