PEN POWER
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 10:18 am Posted By : Sathish Bede

120 కుటుంబాలకు నష్టపరిహారం జాప్యం రంగంలోకి దిగిన రమణారెడ్డి (చిట్టి బాబు)

మిగిలిన నష్టపరిహారం కోసం పోలవరం బాధితులు ఎదురుచూపులు

బిజెపి నాయకుడు డివిఎస్ రమణారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు

చింతూరు పెన్ పవర్ మార్చి 29 :

పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని చింతూరు యూనిట్‌కు చెందిన బాధితులు మిగిలిన ఇళ్ల నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. సుమారు 120 కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై బాధితులకు న్యాయం జరగడం లేదని బిజెపి నాయకుడు డివిఎస్ రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చింతూరుకు వచ్చిన పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ను కలిసిన రమణారెడ్డి, ఈ అంశంపై లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. నష్టపరిహారం చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యాన్ని వెంటనే పరిష్కరించి, పోలవరం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని రమణారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా స్పెషలిస్టు వైద్యులు లేకపోవడంతో నాలుగు మండలాలకు చెందిన రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీబి, కుష్టు వంటి వ్యాధులకు సంబంధించిన నిపుణులను తక్షణమే నియమించాలని కలెక్టర్‌కు సూచించారు. పోలవరం బాధితులకు న్యాయం చేయడం తో పాటు, వైద్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డివిఎస్ రమణారెడ్డి డిమాండ్ చేశారు.