- ప్రత్తిపాటి ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నాదెండ్ల మండల కేంద్రంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు.
- వైద్య శిబిరం ప్రచార పత్రాలను ఆవిష్కరించిన ప్రత్తిపాటి.
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24 :
చిలకలూరిపేట : కంటి సంబంధిత సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ ఈ నెల 29న, ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శంకర కంటి ఆసుపత్రి వారి వైద్య సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు నిచ్చారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఎన్నోఏళ్ల నుంచి నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజా రోగ్య పరిరక్షణే లక్ష్యంగా నాదెండ్ల మండల కేంద్రంలోని పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మండపంలో ఆదివారం నాడు నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని తమకోసమే ఏర్పాటు చేసినట్టు ప్రజలు భావించాలని ఆయన సూచించారు. మంగళవారం ఆయన ఉచిత కంటి వైద్య శిబిరానికి సంబంధించిన ప్రచార పత్రాలను ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలతో పాటు, చుట్టుపక్కల నియోజకవర్గాల వారూ ఉచిత కంటి వైద్యశిబిరానికి భారీ సంఖ్యలో తరలి వచ్చి, తమ కంటి సమస్యలకు నాణ్యమైన ఉచిత వైద్యసేవల్ని పొందాలని కోరారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శంకర నేత్రాలయ వైద్య సిబ్బంది ప్రజలకు తమ సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వాహకులు ఉచిత మెగా వైద్యశిబిరానికి సంబంధించి రోగులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్నిఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, టీడీపీ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కందిమల్ల రఘురామారావు, ఈవూరి బ్రహ్మానందం, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.