PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 1:52 pm Posted By : SIVA KUMAR LANKA

అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి

అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి

-జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ 

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద చెరువులో ఎలాంటి పనులు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ పనులు చేయిస్తున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ గురువారం ఉదయం అనకాపల్లిలో జిల్లా ఎస్పీకి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం పెద్ద చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం పెట్టేందుకు జరుగుతున్న పనులు వల్ల ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులతో కలిసి కోర్టును ఆశ్రయించామన్నారు.  పెద్ద చెరువులో ఎలాంటి పనులు చేపట్టవద్దని కోర్టు స్టే ఇచ్చిందన్నారు. అయినప్పటికీ అధికారులు కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఉపాధి కూలీలతో ఈ పనులు చేయించడం సరికాదన్నారు. వారికి ఉపాధి మరొకచోట కల్పించాలి గాని, కోర్టు ఆదేశాలు ఉన్న పెద్ద చెరువులో పని చేయించడం కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు. వీరందరి పైన కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ తో పాటు వైసిపి లీగల్ సెల్ అధ్యక్షుడు మాకిరెడ్డి బుల్లిదొర, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్  కోనేటి రామకృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.