PEN POWER
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 1:21 pm Posted By : SRIKANTH NARASIMHALA

అర్ధరాత్రి వేళ అంబులెన్స్‌లో ప్రసవం

108 సిబ్బంది సమయస్ఫూర్తితో తల్లి, బిడ్డ క్షేమం

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 03: 

ఎడ్లపాడు : పల్నాడు జిల్లాలో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఒక గర్భిణీకి అంబులెన్స్‌లోనే సుఖప్రసవం జరిగింది. ఎడ్లపాడు మండలం కారచోల గ్రామానికి చెందిన పి. యేసుమ్మ (22) అనే మహిళకు శుక్రవారం అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎడ్లపాడు అంబులెన్స్ సిబ్బంది ఆమెను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమయ్యాయి.పరిస్థితిని గమనించిన ఈఎంటి దేవదానం, పైలట్ అల్లాబక్షు వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, తక్షణ వైద్య సేవలు అందించారు. ఈ క్రమంలో యేసుమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. మొదటి ఇద్దరు ఆడపిల్లల తర్వాత, గుడ్ ఫ్రైడే పర్వదినాన మగ బిడ్డ పుట్టడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడిన సిబ్బందిని 108 జిల్లా మేనేజర్ నాగదీప్, ఎగ్జిక్యూటివ్ రాజేంద్రప్రసాద్ అభినందించారు. ప్రస్తుతం ఇద్దరూ చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు.