గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:అల్లూరి మన్యం ప్రకృతి అందాలకు నిలయంగా నిలుస్తూ, కాలానుగుణంగా విభిన్న పుష్పాలతో సందర్శకులను అలరిస్తోంది. ముఖ్యంగా అమరిల్లిస్ పుష్పాలు ఈ కాలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పంట పొలాల్లోనే కాకుండా గిరిజనుల ఇంటి పెరట్లో కూడా ఇవి విరబూసి మనోహర దృశ్యాలను సృష్టిస్తున్నాయి. జీకేవీధి మండలం దుచ్చరిపాలెం గ్రామానికి చెందిన సాగిన లక్ష్మణ్ ఇంటి పెరట్లో వికసిస్తున్న అమరిల్లిస్ పుష్పాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.ప్రకాశవంతమైన రంగులతో మెరిసే ఈ పుష్పాలు పరిసరాలకు అందాన్ని చేకూరుస్తున్నాయి.జెనీస్ హోపియాస్ట్రం జాతికి చెందిన ఈ పుష్పాలు ప్రతీ సంవత్సరం మార్చి నుంచి జూన్ వరకు విరబూస్తాయని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు తెలిపారు. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో మన్యం ప్రాంతంలో ఈ పుష్పాల పెరుగుదల మెరుగ్గా ఉంటుందని ఆమె వివరించారు.ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను ఆకర్షించే ఈ అమరిల్లిస్ పుష్పాలు అల్లూరి మన్యానికి మరింత ప్రత్యేకతను తీసుకువస్తున్నాయి.