PEN POWER
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 9:24 pm Posted By : M CHANTI BABU

ఒంటరి మహిళకు ఆర్థిక భరోసా– తక్షణమే ఉపాధి కల్పించిన కలెక్టర్

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి, పెన్ పవర్,ఏప్రిల్ 18: ఒంటరి మహిళల సంక్షేమంపై జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేస్తోందని మరోసారి రుజువైంది. కష్టాల్లో ఉన్న మహిళ విన్నపాన్ని సానుభూతితో పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిషాంతి టి., ఆమెకు తక్షణ ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భరోసా కల్పించారు.ముంచంగిపుట్టు మండలం జర్జుల గ్రామపంచాయతీకి చెందిన వి. బిమలమ్మ శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి తన గోడును వినిపించారు. తన భర్త మరణంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని, జీవనోపాధి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆదుకోవాలని, ఏదైనా ఉపాధి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.విషయాన్ని గమనించిన కలెక్టర్ నిషాంతి టి. వెంటనే స్పందించి, బిమలమ్మ పరిస్థితిని పరిశీలించి ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించారు. పంచాయతీ డిఎల్పిఓ పి.ఎస్. కుమార్‌కు ఆదేశాలు జారీ చేసి, సంబంధిత అధికారులతో చర్చించి బిమలమ్మకు ‘క్లాత్ మిత్ర’గా ఉపాధి కల్పించేలా ఉత్తర్వులు ఇచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాధల్లో ఉన్న మహిళలకు అండగా నిలవడం జిల్లా యంత్రాంగం బాధ్యత అని తెలిపారు. బిమలమ్మలాంటి మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించి, వారు స్వయం సమర్థులుగా నిలబడేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.తన విన్నపానికి వెంటనే స్పందించి ఉపాధి కల్పించిన కలెక్టర్‌కు బిమలమ్మ కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.