PEN POWER
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 1:32 pm Posted By : PEN POWER MEDIA

కవితతో వచ్చేదెవరు…

  1. కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త అధ్యాయం
  2. మహిళా రిజర్వేషన్ అజెండాతో మహిళలకు పెద్దపీట?
  3. జాగృతి నుంచి రాజకీయ పార్టీగా కవిత వ్యూహాత్మక అడుగు
  4. బీఆర్ఎస్ అసంతృప్త నేతలు, కార్మిక సంఘాల మద్దతు దక్కుతుందా?
  5. క్షేత్రస్థాయిలో బలం నిరూపించుకోవాల్సిన అసలు పరీక్ష ముందే
హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01:
కవిత కొత్త పార్టీ దాదాపు ఖాయమైపోయింది. ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని ఒంటరిగానే మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. మొదట్లో ఉగాది తర్వాత పార్టీ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల ఆమె పార్టీకి సంబంధించిన కొన్ని వ్యవహారాలు లీగల్ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు ఆ సమస్యలు మొత్తం క్లియర్ కావడంతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు కవిత శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది.కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఆమె వెంట ఎవరు వస్తారు.. ఆమెతో ఎవరు ఉంటారు.. ఆమె కోరుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ శున్యత కనిపిస్తోందా.. అనే ప్రశ్నలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంది. అంతేకాదు.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కవిత ఏర్పాటు చేయబోయే పార్టీపై అందరి ఆసక్తి నెలకొంది. కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు ఏర్పాటు చేయాలని.. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షలు కూడా చేశారు. ప్రస్తుతం ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలో.. మహిళలకు ఆమె పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కవిత చేపట్టే ప్రతి ధర్నా.. నిరసన కార్యక్రమంలో ఆడవాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. పైగా రాజకీయాల్లోకి ఆడవాళ్లు రావాలని కవిత చాలా సంవత్సరాల నుంచే కోరుతున్నారు. అయితే తన పార్టీ నుంచి ఎక్కువగా ఆడవాళ్లకు అవకాశం కల్పించి.. మహిళా సాధికారతను చేతల్లో చూపిస్తారని తెలుస్తోంది.లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని.. ఆ తర్వాత కోర్టు ద్వారా ఉపశమనం పొందిన కవిత.. ఇప్పుడు క్లీన్ ఇమేజ్ సాధించారు. తను మొదటి నుంచి చెబుతున్నట్టుగానే అదంతా కూడా కక్ష సాధింపు చర్య అని జనాలలోకి బలంగా తీసుకెళ్లారు. తద్వారా పులు కడిగిన ముత్యం లాగా తాను బయటికి వచ్చానని కవిత చెబుతున్నారు. అందువల్లే తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తన మానస పుత్రిక అయిన జాగృతిని పార్టీ పేరులో ఏర్పాటు చేస్తున్న కవిత.. రాజకీయ లక్ష్యాలను బలంగానే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయకముందు సింగరేణి నుంచి కొంతమంది కార్మిక సంఘం నాయకులు ఆమెకు మద్దతు పలికారు. ఆమెతో కలిసి ప్రయాణం చేస్తామని ప్రకటించారు. ఇక ఇటీవల కవిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు కొంతమంది నాయకులు ఆమెను కలిశారు. కవిత సపోర్ట్ తో ఇటీవల ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ మున్సిపాలిటీని నాయకులు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత వారు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఇప్పుడు కవితతో ఎవరు వస్తారు.. ఎవరు ఆమెకు అండగా ఉంటారు.. పార్టీ నిర్మాణం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు.. ఆమెకు అనుకూలిస్తాయా.. అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరి వీటికి సమాధానం కవిత ఏ రూపంలో చెప్తారో చూడాల్సి ఉంది.