గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 30:పేదరికం, కష్టాలు అడ్డంకులు కాలేవని నిరూపిస్తూ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంబానికి చెందిన బాలిక పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మండల టాపర్గా నిలిచింది. జీకే వీధి మండలం పూజారి పాకల గ్రామానికి చెందిన పూజారి బాలుదొర తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న ఆయన కుమార్తె దారా స్మైలీ చదువుపై ఆసక్తితో కష్టపడి చదివింది. ఆమెను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్పించి విద్య అందిస్తున్న తండ్రి ఆశలను నెరవేర్చింది. పదో తరగతి పరీక్షల్లో 570 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.సాధారణ తాపీ మేస్త్రి కుమార్తె ఈ స్థాయికి చేరుకోవడం పట్ల గ్రామస్థులు,ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. తన కుమార్తె విజయం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.