PEN POWER
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 1:56 pm Posted By : D Ratnam

గిరిజన గురుకులాలు, ఏకలవ్య ఎంట్రన్స్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తి

 

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 4:
పోలవరం జిల్లాలో గిరిజన సంక్షేమ గురుకులాలు మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించబడ్డాయి. జిల్లా కేంద్రంగా ఆరు పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు మంచి స్పందన లభించింది.5వ తరగతికి 630 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 567 మంది హాజరై 63 మంది గైర్హాజరయ్యారు. అలాగే 6వ తరగతి ఏకలవ్య పాఠశాలల ప్రవేశానికి 1318 మంది అప్లికేషన్లు రాగా, 1199 మంది హాజరై 119 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.పరీక్షలను ఓఎంఆర్ విధానంలో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించారు. రంపచోడవరం, చింతూరు ప్రాంతాల్లో రెండు చొప్పున కేంద్రాలు, అడ్డతీగలలో ఒక కేంద్రంతో మొత్తం ఆరు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ రంపచోడవరం ఉపసంచాలకులు ఎం. రుక్మాంగదయ్య తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థులకు తాగునీరు, అల్పాహారం, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు పరీక్షల నిర్వహణకు 72 మంది ఇన్విజిలేటర్లు, 6 మంది ప్రత్యేక అధికారులు, 6 మంది విభాగాధిపతులు, ఒక రాష్ట్ర స్థాయి పరిశీలకుడు విధులు నిర్వర్తించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.