PEN POWER
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 9:15 am Posted By : A YESOBU

ఘనంగా ఈస్టర్ వేడుకలు…

పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 5

మండల కేంద్రంలో ఈస్టర్ పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తెలుగు బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవులు యేసు క్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకుంటూ ఈస్టర్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రార్థనా మందిరానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చ్ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక గీతాలతో మార్మోగిపోయింది.యేసు లేచెను ఆదివరమున జయ జయ యేసు జయ యేసు అంటూ విశ్వాసులు ఉత్సాహంగా ఈస్టర్ ప్రత్యేక కీర్తనలు ఆలపించి వీధులలో కొవ్వొత్తులతోర్యాలీ నిర్వహించారు. ప్రార్థనల సందర్భంగా యేసు క్రీస్తు త్యాగం, ఆయన పునరుత్థానం విశ్వాసులకు అందించే ఆశ, ధైర్యం, విమోచన సందేశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా పాస్టర్ ఆర్. ఆనందరావు ప్రసంగిస్తూ ఈస్టర్ పండుగ యొక్క ప్రాముఖ్యతను విశదీకరించారు. యేసు క్రీస్తు సిలువపై మరణించి మూడవ రోజు తిరిగి లేచిన సంఘటన క్రైస్తవ విశ్వాసానికి పునాది అని తెలిపారు. పాపాల నుండి విముక్తి, నిత్యజీవానికి మార్గదర్శకత్వం యేసు పునరుత్థానం ద్వారా లభించిందని ఆయన అన్నారు. ప్రతి విశ్వాసి ప్రేమ, క్షమ, త్యాగం అనే విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.ఇక గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. యేసు సిలువపై పలికిన ఏడు మాటలు ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక పరీక్షల్లో యువత, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.మొత్తంగా ఈస్టర్ వేడుకలు భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయి విశ్వాసుల హృదయాల్లో నూతన ఆశలను నింపాయి.విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.