PEN POWER
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 5:00 pm Posted By : SRIKANTH NARASIMHALA

చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో

గత ఏడాదితో పోల్చితే ₹53 లక్షలు అధికం – మొబైల్ కౌంటర్లకు విశేష స్పందన

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 01: 

చిలకలూరిపేట : పట్టణ అభివృద్ధికి కీలకమైన ఆస్తి పన్ను వసూళ్లలో చిలకలూరిపేట పురపాలక సంఘం ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన పురోగతి సాధించింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆదేశాల మేరకు అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు సుమారు ₹10.40 కోట్లు వసూలు చేయగా, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ₹53 లక్షలు అధికం కావడం విశేషం. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల సమీకరణతో పాటు పట్టణంలో మెరుగైన పౌర సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు పన్ను వసూళ్లపై దృష్టి సారించారు.

మొబైల్ కౌంటర్లతో సౌలభ్యం – వసూళ్లలో పెరుగుదల

పన్ను చెల్లింపుదారులకు సౌకర్యంగా ఉండేలా ప్రవేశపెట్టిన మొబైల్ కౌంటర్ వాహనాలు మంచి స్పందన పొందుతున్నాయి. ఈ వాహనాల ద్వారా మాత్రమే సుమారు ₹35 నుంచి ₹40 లక్షల వరకు పన్ను వసూలు కావడం విశేషం. ప్రజలు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్దే పన్ను చెల్లించి వెంటనే రసీదు పొందుతున్నారు.

అధికారుల సమన్వయంతో లక్ష్య సాధన

రెవిన్యూ ఆఫీసర్ సుబ్బారావు, ఆర్.ఐలు గిరిబాబు, అబ్దుల్ ఖాదర్ తదితరులు సమన్వయంతో పనిచేస్తూ వసూళ్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.

మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు మెరుగుపడాలంటే ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా వసూళ్లను వేగవంతం చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు