PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 9:44 pm Posted By : Sathish Bede

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసుల కఠిన చర్యలు

18 లోపు డ్రైవింగ్‌పై హెచ్చరికలు జారీ చేసిన పోలీస్

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 28:

 

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని చింతూరు పోలీసులు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల నిర్వహించిన తనిఖీలలో మొత్తం 30 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై 15 కేసులు, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించిన వారిపై 5 కేసులు, మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై 3 కేసులు, అనధికార పార్కింగ్‌పై 4 కేసులు, ఇతర ఉల్లంఘనలపై 3 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం వంటి ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరి భద్రత కోసం అవసరమని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వారు వాహనాలు నడపకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.