కుయ్యేరు గ్రామానికి గర్వకారణంగా నిలిచిన యువ శాస్త్రవేత్త
కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26:
కాజులూరు మండలం కుయ్యేరు గ్రామానికి చెందిన తాతపూడి వెంకటేశ్వరరావు ఇటీవల జువాలజీ విభాగంలో పీహెచ్డీ (డాక్టరేట్) పట్టా సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం కుయ్యేరు హైస్కూల్ ప్రాంగణంలో రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు.
జువాలజీలో పరిశోధనకు గుర్తింపు
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జువాలజీ విభాగంలో తాను చేసిన పరిశోధనకు పీహెచ్డీ పట్టా లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విజయానికి తన కుటుంబ సభ్యులు, గురువులు అందించిన సహకారం ముఖ్యమని తెలిపారు.
పట్టుదలతో సాధించిన విజయగాథ
కుయ్యేరు హైస్కూల్ హెడ్మాస్టర్ డి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వెంకటేశ్వరరావు కృషి, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ఆయన విజయం గ్రామ యువతకు స్పూర్తిదాయకమని పేర్కొన్నారు.
ప్రశంసల జల్లు కురిపించిన ప్రముఖులు
సన్మాన సభకు అధ్యక్షత వహించిన సురేష్, “వెంకటేశ్వరరావు పీహెచ్డీ సాధించడం మా కుటుంబానికి, గ్రామానికి గర్వకారణం” అని అన్నారు. కె.పి. సుబ్బారావు మాస్టారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
తహశీల్దార్ జి. రవీంద్రనాధ్ ఠాగూర్ మాట్లాడుతూ జువాలజీ విభాగంలో డాక్టరేట్ పొందడం సాధారణ విషయం కాదని, దీని వెనుక ఉన్న కష్టాన్ని గుర్తించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వెంకటేశ్వరరావు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం తహశీల్దార్ దంపతులు శాలువాతో సత్కరించి ఆశీర్వాదాలు అందజేశారు.
గ్రామానికి గర్వకారణం – నేతల అభినందనలు
మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణరావు (డాక్టర్ బాబు) మాట్లాడుతూ వెంకటేశ్వరరావు బాల్యం నుంచి తనకు పరిచయమని, అతని తల్లిదండ్రులు వాడపల్లి, రత్నమ్మ విద్యపై చూపిన శ్రద్ధ ఫలితమే ఈ విజయం అన్నారు. కుయ్యేరు గ్రామం నుంచి డాక్టరేట్ సాధించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు.
ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన పరిశోధన
వక్తలు మాట్లాడుతూ వెంకటేశ్వరరావు చేసిన పరిశోధనకు దేశ విదేశాల యూనివర్శిటీలు గుర్తింపు లభించిందని, అమెరికా, శ్రీలంక, ఖరగ్పూర్ వంటి ప్రాంతాలకు వెళ్లి తన పరిశోధనను ప్రదర్శించడం సాధారణ విషయం కాదన్నారు. ఆయన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుంచి జంతుశాస్త్రంలో పీహెచ్డీ పొందడం విశేషమని పేర్కొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన సభ
కార్యక్రమానికి ముందు చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, భక్తి పాటల నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి. అనంతరం స్కూల్ ప్రాంగణంలోని భారత మాత విగ్రహం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు తహశీల్దార్, ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అభినందనల వెల్లువ
శ్యామ్ సన్ మాస్టారు, సాయి మాస్టారు తదితరులు వెంకటేశ్వరరావును ప్రశంసిస్తూ ఆయన విజయాన్ని కొనియాడారు. గ్రామం నుంచి ఎదిగి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందడం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చీకట్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.