PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 7:03 pm Posted By : Sathish Bede

నిర్వాసితులకు హెచ్చరిక గడువు లోపు పత్రాలు ఇవ్వాలి

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26:

 

విఆర్‌పురం మండలానికి చెందిన నాన్ ఎస్టీ ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ (పిడిఎఫ్స్) పునరావాస ప్రక్రియలో భాగంగా సమర్పించాల్సిన ఆప్షన్ ఫారమ్‌ల స్వీకరణ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ అనేక మంది లబ్ధిదారులు తమ ఫారమ్‌లను పూర్తిగా సమర్పించకపోవడం ఆందోళన కలిగిస్తోంది అని ఐటిడిఏ చింతూరు ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పునరావాస కార్యక్రమంలో, లబ్ధిదారులు ఎంచుకునే విధానం గవర్నమెంట్ కన్స్ట్రక్షన్, సెల్ఫ్ కన్స్ట్రక్షన్ లేదా వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటిఎస్) పై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. లబ్ధిదారులు సమర్పించే ఆప్షన్ ఫారమ్‌ల ఆధారంగానే పునరావాసానికి అవసరమైన భూముల గుర్తింపు, భూఆవశ్యకత మొత్తం అవసరమైన భూమి పరిమాణంపై ఖచ్చితమైన వివరాలు లభిస్తాయని వివరించారు. ఇప్పటికే నాన్ ఎస్టీ పిడిఎఫ్స్ పునరావాసం కోసం అనుకూల భూముల గుర్తింపుకు చర్యలు చేపట్టినప్పటికీ, పూర్తి సమాచారం లభించేందుకు లబ్ధిదారుల నుంచి ఫారమ్‌లు అందాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, విఆర్‌పురం మండలానికి చెందిన అన్ని లబ్ధిదారులు తమ ఆప్షన్ ఫారమ్‌లను పూర్తిగా నింపి ఈ నెల 28వ తేదీ లోపు సంబంధిత ఎంఆర్ఓ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. గడువు లోపు ఫారమ్‌లు సమర్పించని పక్షంలో ప్రాజెక్ట్ అమలు ఆలస్యం కాకుండా తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాబట్టి, లబ్ధిదారులందరూ ఈ విషయాన్ని అత్యంత ప్రాముఖ్యతగా తీసుకుని వెంటనే తమ ఫారమ్‌లు సమర్పించి పునరావాస ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రాజెక్ట్ అధికారి విజ్ఞప్తి చేశారు.