- కలెక్టర్ కె. దినేష్ కుమార్
రంపచోడవరం, ఏప్రిల్ 1 (పెన్ పవర్):
ప్రతి నెల ఒకటవ తేదీన సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు సకాలంలో అందేలా అన్ని ప్రాంతాల్లో సమగ్ర ఏర్పాట్లు చేపట్టినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.బుధవారం రంపచోడవరం మండలంలోని ఐ. పోలవరం, సిరిగిందలపాడు గ్రామాలలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఐ. పోలవరం గ్రామంలో పోడియం గంగమ్మ, కంగల రాములమ్మలకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. గ్రామంలో పింఛన్లు సకాలంలో అందుతున్నాయా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అనే అంశాలపై ఆయన ఆరా తీశారు.అదేవిధంగా “అన్నదాత సుఖీభవ” పథకం కింద రైతులకు నగదు జమ అవుతున్నదీ లేదీ పరిశీలించారు. గ్రామంలో జీడి, మామిడి తోటల విస్తీర్ణం, మార్కెట్ ధరలపై వివరాలు తెలుసుకున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐటీడీఏ ద్వారా జీడిమామిడి పిక్కల కొనుగోలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.ఎత్తిపోతల పథకం మోటార్లు మరమ్మత్తుల కారణంగా సాగునీరు అందడంలేదని రైతులు తెలియజేయగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామంలోని ఆర్వో ప్లాంట్ మరమ్మత్తులు పూర్తవడంతో తాగునీటి సరఫరా మెరుగుపడినట్లు స్థానికులు తెలిపారు.తదనంతరం సిరిగిందలపాడు గ్రామంలో నర్సి బుచ్చమ్మ, చుప్పల లక్ష్మి, ముర్ల బాలు రెడ్డికి పింఛన్లు అందజేశారు.

ఈ గ్రామంలో రేషన్ కార్డులు, బియ్యం సరఫరా, ఉచిత విద్యుత్ (200 యూనిట్ల వరకు) అమలు పరిస్థితులను పరిశీలించారు.అలాగే అంగన్వాడి సేవల ద్వారా బాలింతలకు టీకాలు, పౌష్టికాహారం సకాలంలో అందుతున్నాయా అనే అంశాలను కూడా పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ షరీఫ్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ దాసరి రత్నాకర్ రావు, ఎంపీడీవో ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో గిరిబాబు, సర్పంచ్ కె. వెంకటలక్ష్మి, యాంకర్ పర్సన్ రామరాజు, ఎస్సై వెంకట్రావు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.