PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 4:57 pm Posted By : YEDUKONDALU DADALA

పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద పటిష్ట బందోబస్తు – కాకినాడ ఎస్పీ

కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 27: జిల్లాలో ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లావ్యాప్తంగా ఉన్న 160 పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, తెలిపారు.ఈ ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లైస్ శాఖల అధికారులతో కలిపి 57 జాయింట్ ఇన్‌స్పెక్షన్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంధన రవాణా నిరంతరంగా కొనసాగేందుకు ట్యాంకర్లకు ప్రత్యేక “గ్రీన్ ఛానల్” ఏర్పాటు చేసి, జిల్లా కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు.
రైతులకు సౌలభ్యం:
వరి కోత మిషన్ల కోసం డీజిల్ అవసరమైన రైతులు గ్రామ వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారి లేదా తహశీల్దార్ నుంచి కూపన్లు పొందితే, స్థానిక బంకుల్లో గరిష్టంగా 70 లీటర్ల వరకు డీజిల్ పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు.బంకు యాజమాన్యాలకు హెచ్చరిక:
ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీఐలు, ఎస్సైలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా పరిస్థితులపై ఎస్పీ ప్రతి గంటకు స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.