PEN POWER
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 8:12 am Posted By : M CHANTI BABU

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – విమల కుమారి 

* వనుగుమ్మ గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారిణి ఆధ్వర్యంలో సజావుగా జరిగిన గ్రామసభ.

* గ్రామ సభకు విచ్చేసిన ప్రత్యేక అధికారిణి యు. విమల కుమారికు ఘన సన్మానం.

ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 18.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మండల సిడిపిఓ, వనగుమ్మ పంచాయతీ ప్రత్యేక అధికారిణి యు విమల కుమారి అన్నారు. మండలంలో గల వనుగుమ్మ పంచాయతీ కేంద్రంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామసభ శనివారం నిర్వహించారు. ముందుగా గ్రామసభలో వైస్ ఎంపీపీ సిర్గం భాగ్యవతి మాట్లాడుతూ.. పంచాయితీ పరిధిలో గల ప్రతి గ్రామాలకు మంచి నీటిసౌకర్యము లేదని, తీవ్ర మైనా ఎండలు ఉన్నందున త్రాగు నీరు సమస్యలు ఎదురవకుండా ముందస్తుగా మంచినీరు కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. అదేవిధంగా పంచాయతీలో ఆర్థిక సంఘం నిధులు గ్రామ అభివృద్ధికు కేటాయించాలని ప్రత్యేక అధికారిణికి కోరారు. ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు ఫేషియల్ లో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సంబంధిత అధికారులు పరిష్కార మార్గాలు చూపాలన్నారు. అలాగే జనరల్ కేటగిరి పివిటిజి హౌసింగ్ వచ్చినవారు లంచానికి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి సంబంధిత ఆధారాలు సమర్పించాలన్నారు. అనంతరం పంచాయతీ ప్రత్యేక అధికారిని విమల కుమారి మాట్లాడుతూ.. గ్రామసభలో తీసుకొచ్చిన ప్రతి సమస్యను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, వీఆర్వో విజయలక్ష్మి, వైసీపీ నేతలు జి దేవా, నీలకంఠం, మాజీ ఉపసర్పంచ్ సీతారాం, ఎంఎల్హెచ్పి అరుణ కుమారి, విఆర్పి హరిబందు, అంగన్వాడి కార్యకర్త సూరమ్మ, ఆశ కార్యకర్త సువర్ణ, వివిధ గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.