PEN POWER
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 9:05 am Posted By : M CHANTI BABU

మానవత్వం చాటుకున్న వైకాపా నేత అంజి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో అంజి సేవలు అభినందనీయం

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్9:అల్లూరి జిల్లా జీకే వీధి మండలం పరిధిలోని రింతాడ–ముల్లుమెట్ట మధ్య రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రత వల్ల వారు రోడ్డుకు సుమారు 15 అడుగుల దూరంలో ఉన్న టేకు చెట్ల మధ్య పడిపోయి, కాళ్లు విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.గాయపడిన యువకులు చింతపల్లి మండలం అన్నవరం సమీపంలోని కూర్మన్నపాకలు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. సంఘటన స్థలంలో జనాలు గుమిగూడినప్పటికీ, బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.అదే సమయంలో జీకే వీధి నుంచి చింతపల్లి వైపు వెళ్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జీకే వీధి మండల సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అరికట్ట ఆంజనేయులు (అంజి) సంఘటనను గమనించి వెంటనే స్పందించారు.108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, సిబ్బందితో కలిసి గాయపడిన గిరిజనులను స్వయంగా మోసుకుంటూ అంబులెన్స్‌లో ఎక్కించారు.అంజి అక్కడితో ఆగకుండా, అంబులెన్స్‌తో పాటు వెళ్లి చింతపల్లి ఆసుపత్రిలో బాధితులను చేర్పించి వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.ప్రమాద సమయంలో కొందరు సెల్‌ఫోన్లతో ఫోటోలు తీసుకోవడంలో మాత్రమే పరిమితమవగా, సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడం బాధాకరం. అయితే అంజి చూపిన మానవత్వం, సమయస్ఫూర్తి స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది.